9. మిత్రుడిని, శత్రువును గుర్తించడం
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు మనము
మిత్రులము, మనము మనకు శత్రువులము అంటారు. ఉచ్చుల్లో పడ్డ ఒక
కోతి కథ ఈ విషయాన్ని మరింత తేలిగ్గా అర్ధం చేసుకోవటానికి ఉపయోగ పడుతుంది.
సన్నమూతి ఉన్న ఒక కూజాలో కొన్ని శెనగ గుళ్ళు
ఉన్నాయి. అందులో కోతి చెయ్యి అతి కష్టం మీద దూరగలదు. కోతి తన చేతిని ఆ కూజా యొక్క
మూతిలో దూర్చి చేతినిండా గింజలను పట్టుకుంది. చేతినిండా గింజలు ఉండడంతో చేతి
పరిమాణం పెరిగి కూజా నుంచి బయటకు రాలేక పోతుంది. గుప్పిట నిండా గింజలు పట్టుకుని
తన చేతిని బయటకు తీయడానికి కోతి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎవరో దానికోసం
ఉచ్చు బిగించారని అది భావిస్తుంది. కానీ ఆ ఉచ్చును తనకు తానే ఏర్పరుచుకుందని
ఎన్నడూ గుర్తించలేదు. మనము ఏ విధంగా వివరించినా కూడా ఆ కోతి ఆ గింజలను వదలదు. మనమే
దాని గింజలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నామని భావిస్తుంది.
బయటి నుండి చూసేవారికి కోతి కొన్ని గింజలను
వదిలివేస్తే గుప్పిట వదులై, దాని చెయ్యి బయటికి వస్తుందని
అర్ధమవుతుంది. మనం అనూహ్య పరిస్థితుల్లోనో, విషమ
పరిస్థితుల్లోనో చిక్కుకుని ఉన్నప్పుడు ఈ చిన్న విషయాన్ని గుర్తించడమే చాలా
కష్టమైన విషయం.
మూసిన గుప్పిట మనకు శత్రువు, తెరిచిన గుప్పిట మనకు స్నేహితుడు. గుప్పిట తెరవాలా, ముయ్యాలా
అన్నది మన చేతుల్లోనే ఉంది. దాని ప్రకారమే మనకు మనం మిత్రుడు లేక శత్రువుగా
మారతాము.
జీవితంలో మనం ఇటువంటి ఎన్నో ఉచ్చులను
ఎదుర్కొంటాము. 'నేను',' నాది',
'నాకు', 'నన్ను' అనేవి ఈ
గింజలు, ఉచ్ఛులు; అహంకారం మన చేతిని
వీటితో బంధిస్తుంది. భగవద్గీత పదేపదే మనల్ని అహంకారాన్ని విడనాడమని చెబుతుంది.
అప్పుడు మనం ఈ ఉచ్చుల నుండి బైటపడి పరమ స్వేచ్ఛ అంటే మోక్షం దిశగా పయనిస్తాము.
రణగొణ ధ్వనులతో వేగంగా పరుగులు తీసే ప్రపంచంలో
మనం కాస్త నెమ్మదిస్తే, ఈ ఉచ్చులను గుర్తించడం చాలా సులభం.
ఇటువంటి సాక్షాత్కారాలను పొందడానికి కోవిడ్-19 మహమ్మారి వంటి సమయాలలో మనకు దొరికే
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి