20. మరణం మనల్ని చంపలేదు




శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తారు “నీవు గాని, నేను గాని, ఈ రాజులు గానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అన్న మాటే లేదు” (2.12).

నాశనంలేని శాశ్వతమైన 'జీవన తత్త్వము' యొక్క 'భౌతిక భాగం' నశించడం ఖాయమని, అందువల్ల ముందున్న యుద్ధాన్ని కొనసాగించవలసినదని ఆయన అన్నారు. శాశ్వతమైన 'జీవన తత్వాన్ని' ఆత్మ, చైతన్యం, అవగాహన అన్న పేర్లతో పిలుస్తాము. శ్రీకృష్ణుడు దీనినే 'దేహి' అంటారు.

     శ్రీకృష్ణుడు ఈ సృష్టి యొక్క సారమును వివరిస్తూ శాశ్వతమైన, అపరిమితమైన 'జీవన తత్వము' గురించి చెప్పడం మొదలు పెడతారు. ఈ శాశ్వతమైన అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉంది. ఇది కాలక్రమములో తప్పనిసరిగా నాశనం అవుతుందని అంటారు. శ్రీకృష్ణుడు పాలకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వారిలోని ఉన్న శాశ్వతమైన, నాశనము లేని 'జీవన తత్వము' గురించి ప్రస్తావిస్తున్నారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మనందరమూ రెండు భాగాలతో నిర్మించబడ్డాము. మొదటి భాగము దేహము, మనస్సు - ఈ రెండూ తప్పనిసరిగా నాశనమయ్యేవి. ఇవి సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు లోనవుతాయి. ప్రస్తుత క్షణంలో అర్జునుడు అటువంటి భావనలకే లోనవుతున్నాడు.

రెండవ భాగము శాశ్వతమైన 'దేహి'. మనల్ని శరీరం, మనస్సు (అసత్యము) తో గుర్తించడం మానేసి దేహి (సత్యము) తో గుర్తించడం ప్రారంభించాలని శ్రీకృష్ణుడి ఉద్ఘాటన. బుద్ధత్వం (ఆత్మజ్ఞానం) అనేది ఈ గుర్తింపులను అధిగమించి నప్పుడే కలుగుతుంది. దీనిని అనుభూతి చెందాల్సిందే గానీ మాటల్లో వర్ణించలేము.

యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించే విషయమే భగవద్గీతలో మన అవగాహనకు అత్యంత క్లిష్టమైన భాగం. కొంతమంది అసలు కురుక్షేత్ర యుద్ధమే జరగలేదని, అది మన దైనందిన పోరాటాలకు రూపకం మాత్రమేనని అంటారు. అర్జునుడు దాని నుండి విరమించినా యుద్ధం ముగిసే అవకాశం లేదనేది కూడా నిజం.

శ్రీకృష్ణుడు అవగాహన, బోధన అనే ఆయుధాలతో జీవన యుద్ధాలను ఎదుర్కోవాలని బోధిస్తున్నారు. అహంకారం (అహం-కర్త) తో అర్జునుడు యుద్ధం నుండి వైదొలగినప్పటికి విషాదానికి శాశ్వతంగా బానిస అవుతాడని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుచేత శ్రీకృష్ణుడు 'సత్యము'ను గ్రహించి యుద్ధం చేయమని సలహా ఇస్తారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక