25. అహంకారం నశించినప్పుడు గమ్యం చేరుకుంటాం
“కొందరు 'దీనిని' (ఆత్మని) అద్భుతంగా చూస్తారు, మరికొందరు 'దీనిని' ఒక అద్భుతమని చెబుతారు, మరికొందరు 'దీనిని' అద్భుతమని
వింటారు; అయినప్పటికీ ఇదేమిటన్నది ఎవరికీ తెలియదు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.29).
‘ఎవరికీ' అనే పదం, ఆత్మను అర్థం చేసుకోవడానికి తన ఇంద్రియాలను ఉపయోగించే పరిశీలకుడిని
సూచిస్తుంది. ఈ రెండింటికీ మధ్య విభజన ఉన్నంత వరకు ఒక పరిశీలకుడు ఆత్మను
గ్రహించలేడని శ్రీకృష్ణుడు అంటారు.
ఒకసారి ఉప్పుతో చేసిన ఒక బొమ్మ సముద్రాన్ని
శోధించాలని బయలుదేరింది. ఉపరితలంలోని అలలను దాటి అది సముద్రంలోతుకి వెళ్లి నెమ్మదిగా
కరిగిపోవడం మొదలు పెడుతుంది. సముద్రగర్భాన్ని చేరుకొనే లోపల అది పూర్తిగా
కరిగిపోయి సముద్రంలో భాగమైపోతుంది. అంటే అదే సముద్రంగా మారిపోయిందని, ఉప్పు బొమ్మకు ఇక వేరే ఉనికి లేదని అనవచ్చు. పరిశీలకుడే (ఉప్పు బొమ్మ)
పరికించేది (సముద్రం) గా మారినప్పుడు విభజనలు అంతమై ఐక్యత సాధించబడుతుంది.
ఈ ఉప్పు బొమ్మ మన అహంకారం (అహం కర్త; నేనే కర్తని) వంటిది. ఇది మన ఆస్తులు, ఆలోచనలు,
చర్యల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని సత్యం నుంచి దూరంగా ఉంచడానికి
ప్రయత్నిస్తుంది. అహంకారాన్ని నిర్మూలించి సామాన్యుడిలా, అనామకుడిలా
ఉండడానికి ఎవరూ ఇష్టపడరు.
కానీ ఈ ప్రయాణంలో ఐక్యత, ఏకత్వం
కోసం ఉప్పు బొమ్మలాగా మన అహంకారం కరిగిపోవాలి. మనము మనవి గా భావించే వస్తువులు,
ఆలోచనలు అన్నింటినీ ఫణంగా పెట్టాలని దీనికి అర్ధం.
'మనం' (అహం) నశించినప్పుడే
గమ్యం అరుదెంచే ప్రయాణమిది; ఇక్కడ 'నేను',
'నాది', 'నన్ను', 'నాకు'
అనేవి వాడుకోవడానికి ఉపయోగపడే పరికరాలు అవ్వాలే కానీ మన గుర్తింపులు
కాకూడదు. సుఖదుఃఖ ధృవాల శిఖరాల వద్ద మనం నిరహంకారం యొక్క వీక్షణం పొందుతాము.
సాక్షాత్కారం కలిగే ఇటువంటి క్షణాలలో మనకు
తెలిసినది, మనం చేస్తున్నది, మనకు
ఉన్నవి ముఖ్యం కాదు. 'మనము ఎవరమూ' అన్న
సంగ్రహం కలుగుతుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి