26. గులాబీ పద్మం కాలేదు
శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని గురించి వివరించి
(2.31-2.37), ఒక క్షత్రియునిగా అది అతని స్వధర్మం కనుక
అర్జునుడు యుద్ధం చేసేందుకు సంకోచించకూడదని చెబుతారు (2.31).
శాశ్వతమైనది, అవ్యక్తమైనది,
అన్నిటా వ్యాపించినది అయిన 'దాన్ని' గురించి చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రారంభిస్తారు. దానిని సులభంగా
అర్థం చేసుకునేందుకు ఆత్మ అంటారు. ఆ తర్వాత ఆయన స్వధర్మాన్ని గురించి మాట్లాడతారు.
ఆఖరికి కర్మ విషయానికి వస్తారు.
అంతరాత్మ వైపు ప్రయాణాన్ని మూడు దశలుగా
విభజించవచ్చు. మొదటిది మన ప్రస్తుత స్థితి; రెండవది మన
స్వధర్మాన్ని తెలుసుకోవడం; మూడవది అంతరాత్మను చేరుకోవడం. మన
ప్రస్తుత స్థితి మన స్వధర్మం, అనుభవాలు, జ్ఞానం, జ్ఞాపకాలు, ఊహలతో నిండియున్న
చంచలమైన మనస్సు యొక్క సమ్మేళనం. ఈ సమ్మేళనము నుండి మనల్ని మనం
విడిపించుకున్నప్పుడు స్వధర్మము నెమ్మదిగా స్పష్టమవుతుంది.
క్షత్రియ అన్న పదంలో 'క్షత్'
అంటే 'గాయము'; 'త్రయ'
అంటే 'రక్షణ ఇవ్వడం'. గాయాల
నుంచి మనకు రక్షణనిచ్చేవాడే క్షత్రియుడు.
గర్భంలో ఉన్నప్పటి నుండి పిల్లలు తమ కాళ్ళమీద
తాము నిలబడే దాకా సంరక్షించే తల్లి ఇందుకు ఉత్తమ ఉదాహరణ. కాబట్టి ఆమె మన
జీవితాల్లో మనం చూసిన మొదటి క్షత్రియ. శిక్షణ లేకపోయినా, అనుభవం
లేకపోయినా పిల్లల సంరక్షణ ఆమెకు సహజంగా వస్తుంది. ఈ లక్షణం స్వధర్మాన్ని అర్ధము
చేసుకోవడానికి సహకరిస్తుంది.
ఒకసారి ఒక అందమైన పద్మాన్ని చూసి విస్మయం చెందిన
గులాబీ, తానూ పద్మం అవ్వాలన్న కోరికను పెంచుకుంది. కానీ
గులాబీ పద్మంగా మారే ఉపాయమేమీ లేదు. తనకున్న సామర్థ్యానికి భిన్నంగా ఉండాలని
గులాబీ కోరుకుంది. మనందరికీ కూడా మన స్వధర్మానికి భిన్నంగా ఉండాలన్న ఇటువంటి
స్వభావాలే ఉంటాయి, ఫలితంగా అర్జునుడిలా విషాదానికి
గురవుతాము. గులాబీ తన రంగును, పరిమాణాన్ని, ఆకారాన్ని మార్చుకోగలదు కానీ తన స్వధర్మమైన గులాబీగానే ఉండి పోవాల్సిందే.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి