33. వేదాలను అధిగమించి అంతరాత్మను పొందడం
ఒకసారి ఒక
మిత్రబృందం ప్రయాణిస్తూ ఒక పెద్ద నదిని దాటాల్సి వచ్చింది. వారొక పడవను తయారుచేసి
నదిని దాటారు. ఆ తర్వాత ఆ పెద్ద పడవ తమకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మిగతా
ప్రయాణమంతా దాన్ని మోసుకు వెళ్లాలని అనుకున్నారు. ఇందువల్ల వారి ప్రయాణం
నెమ్మదించింది; ఇబ్బందికరంగా
మారింది. ఇక్కడ నది ఒక బాధాకరమైన ధృవం అనుకుంటే పడవ ఆ ధృవాన్ని అధిగమించేందుకు ఉపయోగపడే
పరికరం. కానీ నది లేనిచోట సాగే ప్రయాణములో ఆ పడవే భారంగా మారుతుంది.
ఇలాగే మన దైనందిన
జీవితాల్లో మనం ఎదుర్కొనే అనేక బాధాకరమైన పరిస్థితుల నుంచి మనకు విముక్తి కలిగించే
అనేక పరికరాలు, అనుష్ఠానాలు
ఉన్నాయి. ఇటువంటి తాత్కాలిక బాధల నుంచి ఉపశమనం పొందడం కోసం వేదాలు అనేక
అనుష్ఠానాలను వివరించాయి. ఈనాటికీ ఈ ఆచారాలు అందుబాటులో ఉన్నాయి; ఆచరించబడుతున్నాయి. ఆరోగ్యం, వ్యాపారం, పని, కుటుంబ రంగాలలో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ
అనుష్ఠానాల సహాయం తీసికొనడం తార్కికంగా అనిపిస్తుంది.
వేదాల బాహ్య
అర్థాన్ని వివరిస్తు ఈ జీవితంలో సుఖాన్ని,
మరణానంతర స్వర్గాన్ని వాగ్దానం చేసే తెలివితక్కువ వారి మాటలలో
చిక్కుకోవద్దని శ్రీకృష్ణుడు ఉపదేశించారు (2.42-2.46). శ్రీకృష్ణుడు
అర్జునుడిని ధ్రువాలను అధిగమించి (ద్వంద్వాతీత), గుణాలను అధిగమించి
(గుణాతీత) ఆత్మవానుడు (ఆత్మలో స్థిరపడినవాడు) గా మారమని ప్రోత్సహిస్తారు (2.45).
ఒక పెద్ద సరస్సు దొరికినప్పుడు ఎవరికైనా చిన్న చెరువు అవసరం ఉండదు. అదేవిధంగా
ఆత్మవానుడికి వేదాలు చిన్న చెరువులు లాంటివి (2.46).
మన జీవన ప్రయాణంలో
పడవ యొక్క భారాన్ని మోస్తూ మనల్ని మనం బాధించుకోకుండా ఉండటం వివేకం అయినట్లే; సుఖం, శక్తిని
పొందడానికి చేసే ప్రయత్నాలెంత వ్యర్ధమైనవో అర్థం చేసుకొని వేదాలను అధిగమించమని
శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తున్నారు.
శ్రీకృష్ణుడు
అర్జునుడికి ఇంద్రియముల-ఇంద్రియ విషయాల కలయిక సుఖదుఃఖాలనే ద్వంద్వాలను తెస్తుందని, అవి అనిత్యం (అశాశ్వతం) కాబట్టి
వాటిని ఓర్చుకోమని సలహా ఇచ్చారు (2.14). వాటిని అధిగమించి ఈ క్షణికాలకి ద్రష్ట
(సాక్షి) గా ఉండడం నేర్చుకోవాలనేది ఆయన ఉద్ఘాటన. శ్రీకృష్ణుడు కృత్రిమ సుఖాల కంటే
ప్రామాణికమైన ఆనందానికి అనుకూలంగా ఉంటారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి