41. అంతర్గత యాత్రకు సమగ్రమైన బుద్ధి
యోగం అంటే మన లోపలి, వెలుపలి భాగాల కలయిక. కర్మయోగ,
భక్తియోగ, సాంఖ్యయోగ, బుద్ధియోగ
మార్గాల ద్వారా దీనిని పొందవచ్చు. ఒకరి స్వభావాన్ని బట్టి వారికి తగిన మార్గాల
ద్వారా యోగాన్ని పొందుతారు.
“ఈ సమత్వబుద్ధి
యోగము కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున, నీవు సమత్వ బుద్ధియోగమునే
ఆశ్రయింపుము. ఏలనన, ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత
దీనులు, కృపణులు” అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు
(2.49). అంతకుముందు, శ్రీకృష్ణుడు కర్మయోగంలో బుద్ధి
పొందికగా ఉంటుందని మరియు అస్థిరమైన వారి బుద్ది నిలకడ లేకుండా ఉంటుందని చెప్పారు
(2.41).
ఒకసారి సమగ్ర బుద్ధి
సాధిస్తే భూతద్దం కాంతిని కేంద్రీకరించినట్లు బుద్ధి జ్ఞానోపాసనలో సమర్ధతను
పొందుతుంది. 'స్వయం'
వైపు ప్రయాణంతో సహా ఏదైనా ప్రయాణం దిశ, గమనం
కలిగి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అంతరాత్మ వైపు ప్రయాణం యొక్క దిశ గురించి ప్రస్తావిస్తున్నారు.
సాధారణంగా మనం బాహ్య (భౌతిక) ప్రపంచంలో కోరికలను నెరవేర్చుకోవడానికి తెలివిని
ఉపయోగిస్తాము. అయితే మనం 'స్వయం'
వైపు మన ప్రయాణాన్ని కొనసాగించడానికి బుద్ధిని ఉపయోగించాలని
భగవద్గీత బోధిస్తుంది.
మన పాతుకుపోయిన
నమ్మకాలు, భావోద్వేగాలు,
ఊహలు, ఆలోచనలు, చర్యలు,
మనం మాట్లాడే పదాలు వంటి ప్రతిదానిని ప్రశ్నించడం ప్రారంభించడమే
అంతర్గత ప్రయాణం కోసం పొందికైన బుద్ధిని ఉపయోగించడంలో మొదటి అడుగు. జ్ఞానం యొక్క
సరిహద్దులను దాటడానికి విజ్ఞాన శాస్త్రం ప్రశ్నించడాన్ని ఉపయోగించినట్లు మనము కూడా
ఇటువంటి ప్రశ్నలు మనలోని పరమ సత్యాన్ని వెలికి తీయడానికి ఉపయోగించవచ్చు.
కర్మ ఫలాలను
పొందాలనే ఉద్దేశ్యంతో ఉన్న వారు దుఃఖితులని శ్రీకృష్ణుడు చెప్పారు. కొన్నిసార్లు
కర్మ యొక్క ఫలాలు మనకు సుఖాన్ని ఇస్తాయి కాబట్టి మనము ఈ ధోరణిని పెంపొందించు కుంటాము.
కానీ ధృవీయ ప్రపంచంలో ప్రతి సుఖం కాలక్రమేణా దుఃఖంగా మారుతుంది. కర్మఫలాలను
పొందాలనే ఈ ఉద్దేశం మన జీవితాలను నరకం చేస్తుంది అనే నిజాన్ని గుర్తు
పెట్టుకోవాలి.
శ్రీకృష్ణుడు మనల్ని
ద్వంద్వాల నుండి రక్షిస్తానని ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ 'ఆత్మవానుడు'గా
మారి వాటిని అధిగమించడానికి పొందికైన (సమగ్ర) బుద్ధిని ఉపయోగించమని చెప్పారు. ఇది తెలుసుకోవడం లేదా చేయడం కాదు;
కేవలం 'ఉండడం'.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి