48. 'స్వయం'తో సంతృప్తి
శ్రీకృష్ణ భగవానుడు
శ్లోకము 2.11 నుంచి శ్లోకము 2.53 వరకు సాంఖ్యయోగం అంటే ఏమిటో వెల్లడించారు. ఇది
అర్జునుడికి కొత్త విషయం. అర్జునుడు సమాధిని సాధించిన స్థితప్రజ్ఞ పురుషులు ఎలా
మాట్లాడుతారో, కూర్చుంటారో,
నడుస్తారో తెలుసుకోవాలనుకున్నాడు (2.54).
అర్జునుడికిచ్చే
వివరణల ద్వారా, శ్రీకృష్ణుడు,
మన చంచల మనస్సుని అదుపులో పెట్టడానికి కొలమానాలను నిర్ధారించారు.
వీటిని ఉపయోగించుకొని ఆధ్యాత్మిక ప్రయాణంలోని మన పురోగతిని స్వయంగా కొలుచుకోవచ్చు.
శ్రీకృష్ణుడు ఇలా
చెప్పారు, “మనస్సు నందలి
కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందు
సంతుష్టుడై, ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని
యందురు” (2.55). ఒక వ్యక్తి తనపట్ల తాను సంతృప్తి చెందినప్పుడు కోరికలు వాటంతటవే
నశించిపోతాయి. కోరికలు లేని ఆ స్థితిలో వారు చేసే చర్యలన్నీ నిష్కామ కర్మలు
అవుతాయి.
ఉన్నదానికంటే
భిన్నంగా ఉండాలనేది మన ప్రాథమిక కోరిక. మనకున్న ప్రస్తుత పరిస్థితితో మనం చాలా
త్వరగా విసుగు చెందుతాము. ఈ స్థితిని అర్థశాస్త్రంలో 'తీరిన కోరిక మనల్ని ప్రేరేపించదు'
అని అంటారు. ఈ విషయాన్ని మనమందరము ఇతరులపై ఒక వ్యూహంగా
ఉపయోగిస్తాము. దాని వలన స్థితప్రజ్ఞతను పొందడం కష్టతరం అవుతుంది. ఉదాహరణకు,
వినియోగదారుల కోసం ఉత్పత్తుల కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త
మోడల్స్ ను పరిచయం చేస్తాయి. ఎందుకంటే మనం ప్రతిసారీ విభిన్నమైన మోడల్ ను
తీసుకోవాలని కోరుకుంటామనే విషయం వారికి బాగా తెలుసు.
మనం మనపట్ల సంతృప్తి
చెందకపోతే ఇతరులు మనతో సంతృప్తిగా ఉండగలరని ఎలా ఆశించగలం? అట్లాగే తమను తాము తృప్తి పరచుకునే
సమర్థత లేని వారి నుంచి మనం సంతృప్తిని ఎలా పొందగలం? ,
కోరికలను
వదిలివేయడానికి సుఖాన్ని వెంటాడడం ఎండమావిని వెంబడించడం లాంటిదన్న లోతైన అవగాహన
కావాలి. జీవిత అనుభవాలన్నీ ఈ ప్రాథమిక సత్యాన్నే ధృవీకరిస్తాయి. కోరికలను
వదిలేయడానికి ఆచరణాత్మక మార్గం ఏమిటంటే వాటి తీక్షణతను తగ్గించడం, వాటిని వెంబడించడం తగ్గించడం. ఇలా
చేయడం వల్ల మనము ఎంత ప్రశాంతంగా ఉండగలమో అర్ధమవుతుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి