71. గుణాల పరస్పర ప్రభావం
“వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతి
గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన
అంతఃకరణముగల అజ్ఞాని) ‘ఈ కర్మలకు నేనే కర్తను' అని భావించును. కానీ, గుణ విభాగ తత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు
ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తుడు కాడు” అని
శ్రీకృష్ణ భగవానుడు విశదీకరించారు (3.27, 3.28).
భగవద్గీత యొక్క మూలోపదేశం ఏమిటంటే ఏ కర్మలకు మనం
కర్త కాదు. మనలోని, ఇతరులలోని గుణాల మధ్య పరస్పర ప్రభావం వలన
కర్మలు జరుగుతాయి. సత్వ, తమో, రజో అనే
మూడు గుణాలు మనలోని ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. సత్వగుణం
జ్ఞానానికి అనుబంధం, రజోగుణం అనేది కర్మతో అనుబంధం; తమస్సు అజ్ఞానానికి, సోమరితనానికి దారి తీస్తుంది.
ఏ గుణమూ ఇంకొక గుణము కంటే గొప్పది లేదా తక్కువ
కాదు అని గమనించాలి. అవి కేవలం గుణాలు. ఉదాహరణకు, ఒక
వ్యక్తిలో రజోగుణం ఎక్కువగా ఉన్నట్లయితే వారు పనుల పట్ల గాఢంగా మొగ్గు చూపుతూ
నిద్ర కూడా పోలేరు. నిద్రించడానికి తమస్సు గుణం అవసరం.
రెండవది, ప్రస్తుత క్షణంలో
మనపై ఆధిపత్యం చెలాయించే గుణం గురించి మనకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు తమస్సు
ప్రభావంతో ఒకరు బద్ధకంతో సోఫాపై కూర్చుని టివి చూడడానికి ఇష్టపడతారు. మరోవైపు వారి
జీవిత భాగస్వామి రజోగుణంలో ఉన్నట్లయితే అతను/ఆమె ఏదైనా షాపింగ్, సినిమా, స్నేహితులను సందర్శించడం మొదలైన వాటి కోసం
బయటకు వెళ్లాలని కోరుకుంటారు. తమో-రజో గుణాల మధ్య పరస్పర
సంపర్కం మీద తదుపరి పరిస్థితులు ఆధారపడతాయి. గుణాల పరస్పర ప్రభావంతో నడిచే ఇలాంటి
పరిస్థితులు మనం పని చేసే కార్యాలయాల్లో కూడా సంభవిస్తాయి.
“మనం గుణాతీతులుగా మారడానికి గుణాలను
అధిగమించగలగాలి” (14.22-14.26) అని శ్రీకృష్ణుడు
బోధిస్తున్నారు అంటే ప్రస్తుత క్షణంలో మనపై, ఇతరులపై
ఆధిపత్యం చెలాయించే గుణాల గురించి అవగాహన కలిగి వాటి పరస్పర సంపర్కాలకు మనం కేవలం
సాక్షిగా మిగిలిపోవడం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి