80. మాయ యొక్క అభివ్యక్తి
తిరిగే చక్రానికి స్థిరమైన లేదా మార్పులేని ఇరుసు అవసరం అయినట్లే నిరంతరం మారుతూ, వ్యక్తమయ్యే భౌతిక ప్రపంచానికి కూడా తన ఉనికిని కొనసాగించడానికి ప్రశాంతమైన, స్థిరమైన, అవ్యక్తమైన కేంద్రము అవసరం. అర్జునుడు మనలాగే వ్యక్తీకరించబడిన మానవ శరీరం యొక్క స్థాయిలో ఉన్నాడు కనుక అతని బంధువుల మరణం గురించి చింతిస్తున్నాడు. వారు కేవలం వ్యక్తీకరించబడిన అస్తిత్వాలు. ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న సర్వోన్నత ప్రభువైన శ్రీకృష్ణుడు అవ్యక్తం కొన్నిసార్లు ఏ విధముగా వ్యక్త రూపాన్ని ధరిస్తుందో వివరిస్తున్నారు.
“నేను జన్మరాహితుడని, శాశ్వతుడను మరియు జీవులకు ప్రభువును.
నా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని, యోగమాయ ద్వారా నేను అవతారం
ధరిస్తాను” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.6). అవ్యక్తమైనది ఒక విచారమనే మాయ ద్వారా
వ్యక్తమౌతుంది. పరమాత్మ కూడా అలాగే అవతారం ధరిస్తారు. కానీ కోరికలు, కరుణ, స్పృహ స్థాయిలో తేడా ఉంటుంది.
శ్రీకృష్ణుడు ఇంకా
ఇలా అంటారు, “ధర్మమునకు
హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చుపెరిగిపోవు చున్నప్పుడును
నన్ను నేను సృజించుకుందును. అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును (4.7).
సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును,
ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును
అవతరించుచుందును” (4.8).
సత్పురుషులను
రక్షించడానికి పరమాత్మ మన సమీపంలోనే ఉన్నాడని అందరికీ భరోసా ఇవ్వడానికి సజ్జనులు తరచూ
ఈ శ్లోకాలను ఉటంకిస్తూ ఉంటారు. ధర్మం లేదా ధార్మికత క్షీణించినప్పుడల్లా; అధర్మం లేదా చెడు
పెరుగుతున్నప్పుడల్లా ఆయన అవతారంగా భూమిపైకి వస్తారని ఈ శ్లోకం యొక్క అర్ధం
సూచిస్తుంది.
లోతైన స్థాయిలో
ధర్మం, అధర్మం అంటే ఏమిటి;
ఎవరు సాధువు మరియు ఎవరు దుష్టుడు; వారిని వేరు
చేసేది ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి?
సాధువులు, దుష్టుల విషయంలో, వారి గుణాత్మకమైన పవిత్రత లేదా దుష్టత్వం రక్షించబడాలి లేదా నాశనం
చేయబడాలి. అదేవిధంగా ధర్మం, అధర్మం శాశ్వత స్థితిలో ఉన్న
అంతరాత్మ వైపు లేదా దాని నుండి దూరంగా ప్రయాణించే దిశగా తీసుకోవచ్చు. సరైన
మార్గాన్ని గుర్తించడానికి పరమాత్మ సహాయం అవసరం పడుతుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి