82. మనం విత్తినదే కోసుకుంటాము
“పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరునూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు” అని శ్రీకృష్ణుడు చెబుతూ శక్తివంతమైన అవ్యక్తానికి, వస్తురూపం దాల్చిన వ్యక్తానికి మధ్య సంబంధం గురించి అంతర్దృష్టిని ఇస్తున్నారు (4.11).
మనం ఏ మార్గాన్ని
అనుసరించినా ఈ మార్గాలు ఎంత వైరుధ్యంగా కనిపించినా అవన్నీ అవ్యక్తమైన పరమాత్మను
చేరుకునే మార్గాలేనని భగవంతుడు ఇచ్చిన హామీ. రెండవది, భగవంతుడు మన భావాలు, ఆలోచనలు, చర్యలను ప్రతిబింబించే, ప్రతిధ్వనించే బహుళ పరిమితుల అద్దం (multi-dimensional mirror) లాంటివారు. మూడవది, మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు
అది మొలకెత్తి ఒక చెట్టుగా పెరగడానికి సమయం పడుతుంది. ఈ సమయ జాప్యం వలన మనం
పరమాత్మ యొక్క ప్రతిధ్వని సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాము.
మనం మన జీవితాలను
షరతులు లేని ప్రేమ,
శ్రద్ధతో నింపుకుంటే ప్రేమ, శ్రద్ధ అనివార్యంగా తిరిగివచ్చి
మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. మనం కోపాన్ని, భయాన్ని,
ద్వేషాన్ని, క్రూరత్వాన్ని లేదా అసూయను నాటితే
అవే తిరిగి వ్యాపించి మన జీవితాలను దుర్భరం చేస్తాయి. వీటికి లెక్కలేనన్ని
ఉదాహరణలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే విత్తడం, కోయడం
మధ్య ఉన్న జాప్యం వల్ల రెండింటి మధ్య ఉన్న ధృడమైన సంబంధాన్ని మనం మర్చిపోతాము.
ఈ శ్లోకం సూక్ష్మ, స్థూల రెండు స్థాయిలలో పని చేస్తుంది.
మనం పెద్ద పెద్ద కలలను నిజం చేసుకోవాలని చూస్తున్నప్పుడు అనుభవ స్థాయిలో అత్యున్నత
స్పృహను గ్రహించడంలో మనకు సహాయపడే చిన్న చిన్న అనుభావాలను మనం ఎల్లప్పుడూ గుర్తు
పెట్టుకోవాలి.
“ఈ లోకంలో
కర్మఫలాలను ఆశించే వారు ఇతర దేవతలను పూజిస్తారు. ఏలనన, అట్లు
చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి లభించును” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (4.12).
దేవతలు పరమాత్మ రూపం
తప్ప మరొకటి కాదు. పరమాత్మను పొందడానికి మనం అహంకారాన్ని పూర్తిగా విడనాడాలి కానీ
దానికి సమయం పడుతుంది. మనం అహంకారాన్ని వదిలివేస్తూ పరమాత్మ సాక్షాత్కారం వైపు
సాగించే ప్రయాణంలో దేవతలు మధ్య బిందువు వంటివారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి