90. త్యాగాన్ని త్యజించడం
యజ్ఞమనేది త్యాగం
లేదా నిష్కామ కర్మలకు ప్రతీకం. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “కొందరు యోగులు దేవతల కోసం త్యాగం
చేస్తారు. మరికొందరు త్యాగం అనే భావనని బ్రహ్మ యొక్క అగ్నిలో త్యాగం చేస్తారు”
(4.25).
అవగాహన లేని
వ్యక్తికి జీవించడం అంటే ధనాన్ని ప్రోగు చేసి దానిని సంరక్షించడం. వస్తువులు, ఆలోచనలను, భావాలను
త్యాగం చేయడం జీవితం యొక్క తదుపరి దశ. ఇది అహంకార బీజాలను మనస్సు యొక్క సారవంతమైన
నేలపై నాటడానికి బదులు అగ్నికి ఆహుతి ఇవ్వడం లాంటిది. మూడవ దశలో అంతా బ్రహ్మమే అని
గ్రహించి త్యాగం అనే భావననే త్యాగం చేయడం.
మనస్సు ఆధారిత
కర్మయోగి కర్మలను చెయ్యడానికి చూస్తూ ఉంటాడు కాబట్టి యజ్ఞం చేయడం అతనికి మార్గమని
చెప్పవచ్చు. బుద్ధి ఆధారిత జ్ఞానయోగి స్వచ్ఛమైన అవగాహన కోసం చూస్తూ త్యాగాన్నే
త్యాగం చేస్తాడు. మొదటిది క్రమానుగతం అయితే రెండోది చాలా పెద్ద ఘటన కానీ అరుదైనది.
ఈ రెండు మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయి.
శ్రీకృష్ణుడు ఈ
వాస్తవికతను ఇంద్రియాల సందర్భంలో ఇలా వివరిస్తారు, “కొంతమంది యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన
రూపాగ్నులయందు హోమము చేయుదురు. మరి కొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను
ఇంద్రియరూపాగ్నులయందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా
ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితంగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను
లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రమూ ఉండదు” (4.26). సంక్షిప్తంగా,
ఇది త్యాగాన్నే త్యాగం చేసే మార్గం.
శ్రీకృష్ణుడు
ఇంద్రియాలు, ఇంద్రియ
విషయాల మధ్య సంబంధాన్ని గురించి అనేకసార్లు భగవద్గీతలో వివరించారు. ఇంద్రియాలు తమ
తమ ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు రాగద్వేషాలు అనే ద్వంద్వాలకు గురి అవుతాయి. ఈ
ద్వంద్వాల పట్ల మనం అప్రమత్తులమై ఉండాలి (3.34).
విశేష కృషితో
కర్మయోగి ఇంద్రియాలకు, ఇంద్రియ
వస్తువులకు మధ్య వంతెనను విచ్ఛిన్నం చేస్తాడు. ఇది శ్లోకం 4.26 లో మొదటి భాగంలో
చెప్పబడిన త్యాగం. అవగాహన ద్వారా సాక్షిగా మారి తనను తాను త్యాగం చేసే జ్ఞానయోగి
గురించి రెండో భాగం వర్ణిస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ మనం ద్వంద్వాలను
అధిగమిస్తాము.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి