113. పరిస్థితులను స్వీకరించడం
"పరమాత్మ ప్రాప్తిని పొందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞానవిజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును" అని శ్రీకృష్ణుడు చెప్పారు (6.8).
జ్ఞానమంటే తన గురించిన అవగాహన. దానిని సాధించినప్పుడు మనము సంతృప్తి చెందుతాము. విజ్ఞానాన్ని సైన్స్ అని
కూడా పిలుస్తారు. ఇది వస్తువులను, వ్యక్తుల గురించి అర్ధం
చేసుకోవాలనే కుతూహలం. ఈ కుతూహలంతో పొందిన సమాధానాలు గతానికి సంబంధించినవి, మరియు పుస్తకాలలో లభించే జ్ఞానం తప్ప మరేమి కాదు. అంతర్గత ప్రయాణం యొక్క
ప్రారంభ దశలలో ఈ కుతూహలం మనకు సహాయపడుతుంది కానీ దానికి పరిమితులు ఉంటాయి. కణాలు (particle)
మరియు తరంగాలకు (waves) సంబంధించిన
ద్వంద్వత్వం మరియు అనిశ్చితి సూత్రము (Principle of Uncertainty) వంటి ఈ పరిమితుల గురించి విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది.
మరోవైపు, అస్తిత్వం
నిరంతరం పరివర్తన చెందుతూనే ఉంటుంది. పరిస్థితులను సృష్టించి తద్వారా అనుభవాలను మనకు
ఇస్తుంది. ఈ అనుభవాలను ఇతరులతో
పంచుకోవడానికి ఏ మార్గం లేదు ఎందుకంటే ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి వేర్వేరుగా
ఉంటాయి, వేర్వేరుగా అర్థం చేసుకుంటారు. జ్ఞానంలో సంతృప్తి
అనేది మన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికినవని కాదు. మన కుతూహలము తగ్గిపోయిందని
అర్థం. ఈ స్థితి సాక్షి లేదా ద్రష్ట అవస్థ
తప్ప మరొకటి కాదు. ఇది విషయాలు, వ్యక్తులు మరియు
పరిస్థితులను ఎటువంటి విభజనలు, అంచనాలు లేకుండా అంగీకరించే 'ఎంపికలేని అవగాహన' స్థితి.
శ్రీకృష్ణుడు ఇంద్రియాలను జయించి నిశ్చలంగా
ఉండమని పదే పదే చెప్పారు. ఎవరైనా మనల్ని
మెచ్చుకున్నప్పుడు, మనం దానిలోని ప్రతి అంశానికి అర్హుడని
భావించుతాము. ఎవరైనా విమర్శిస్తే మనకు కోపం వస్తుంది. ప్రశంసలు అనేవి ఒక మధురమైన
విషం లేదా ఒక వల అని గ్రహించడం ద్వారా ప్రశంసలు మరియు విమర్శల యొక్క ధ్రువాలను
అధిగమించే దిశలో మన ప్రయాణాన్ని సులభంగా సాగించవచ్చు. ప్రశంస, విమర్శ, బంగారము, మట్టి,
రాయి వంటి వాటిని ఒకేవిధంగా భావించి సమత్వాన్ని పొందినప్పుడు మనం
నిశ్చలంగా ఉంటాము అంటే మోక్షాన్ని పొందుతాము.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి