117. నిగ్రహము అనే కళ
మన మెదడు ఓక అద్భుతమైన అవయవం. దానికున్న ఓక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే దానికి నొప్పి ఏమిటో తెలీదు ఎందుకంటే నొప్పిని గురించి మెదడుకు సూచనలు పంపే నోసిసెప్టార్లు మెదడులో ఉండవు. న్యూరో సర్జన్లు ఈ లక్షణాన్ని ఉపయోగించి మనిషి మేలుకొని ఉన్నప్పుడు మెదడు యొక్క శస్త్రచికిత్స చేస్తారు.
శారీరక నొప్పులు మరియు ఆహ్లాదాలు మన మెదడు యొక్క
తటస్థ స్థితితో పోల్చడం వలన కలిగే అనుభవాలు. అలాగే మానసిక భావాలకు కూడా ఇదే
వర్తిస్తుంది. మనందరిలో ఒక తటస్థ బిందువు ఉంటుంది. ఈ తటస్థ
బిందువుతో పోలిక సుఖము, దుఃఖముల యొక్క ధ్రువణాలకు దారి
తీస్తుంది. ఈ నేపథ్యం శ్రీకృష్ణుడు చెప్పినది అర్థం చేసుకోవడానికి మనకు
సహాయపడుతుంది, "ధ్యానయోగ సాధనం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు స్థిరమైనప్పుడు యోగి అంతరాత్మను
దర్శనం చేసుకొని ఆత్మసంతృప్తి చెందుతాడు" (6.20).
స్థిరపడటం అనేది కీలకం. అంటే చంచలమైన లేదా
ఊగిసలాడే మనస్సును స్థిరపరచడం. దానిని సాధించేందుకు శ్రీకృష్ణుడు నిగ్రహమును
పాటించాలని సూచిస్తారు. నిగ్రహము అంటే మన భావాలను అణచివేయడం లేదా వాటి వ్యక్తీకరణ
కాదు. ఇది అవగాహనతో మనలో ఉత్పన్నమయ్యే ఈ భావాలను సాక్షి లాగా చూస్తూ ఉండడం. మనం
ఎదుర్కొన్న గత పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఈ నిగ్రహాన్ని సులభంగా
సాధించవచ్చు.
ఒకసారి మనం నిగ్రహం అనే కళలో ప్రావీణ్యం పొందిన
తర్వాత, ఆ తటస్థ బిందువు అంటే అత్యున్నత ఆనందాన్ని
చేరుకోవడానికి సుఖము, దుఃఖము యొక్క ధ్రువణాలను అధిగమిస్తాము.
ఈ విషయంలో శ్రీకృష్ణుడు ఇలా అంటారు, "ఇంద్రియాతీతమైన
మరియు పవిత్ర సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైన బ్రహ్మానందమును
అనుభవించుచు దానియుందే స్థితుడైయున్న యోగి వాస్తవికతనుండి ఏమాత్రము విచలితుడు
కానేకాడు" (6.21).
పరమానందం ఇంద్రియాలకు అతీతమైనది. ఈ స్థితిలో,
ఇతరుల నుండి ప్రశంసలు లేదా రుచికరమైన ఆహారం మొదలైనవాటి అవసరం ఉండదు.
మనమందరం ఈ ఆనందాన్ని ధ్యానంలో లేదా నిష్కామ కర్మలు చేసిన క్షణాలలో పొందుతాము. మన
భాద్యత ఏమిటంటే ఈ క్షణాలను గుర్తించి మన అన్ని జీవిత క్షణాలలో విస్తరింపజేయడం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి