138. భ్రాంతులను అధిగమించడం
భగవద్గీతలోని ఏడవ
అధ్యాయాన్ని 'జ్ఞాన-విజ్ఞాన-యోగము'
అని అంటారు. జ్ఞాన-విజ్ఞానాన్ని వ్యక్తమైన
జగత్తు మరియు అవ్యక్తమైన పరమాత్మ యొక్క అవగాహనగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ
అధ్యాయంలో శ్రీకృష్ణుడు రెండు హామీలు ఇచ్చారు. మొదటిది, ఒకసారి
'ఇది' తెలిసిన తర్వాత, తెలియడానికి ఏమీ మిగలదు (7.2). రెండవది, మరణించే
సమయంలోనైనా 'ఇది' అర్థం చేసుకుంటే,
వారు నన్ను పొందుతారు (7.29).
వ్యక్త రూపంలో
ఉన్నది, నశించేది ఎనిమిది
విధములుగా ఉంటుంది (7.4). అవ్యక్తమైన జీవన
తత్త్వము ఇంద్రియాల సామర్ధ్యానికి అతీతమైనది. రత్నాల ఆభరణములో కట్టి ఉంచే సూత్రము లాగా
వ్యక్త రూపంలో ఉన్న ప్రాణులకు అవసరమైన మద్దతునందిస్తుంది (7.7). వ్యక్తరూపంలో
ఉన్నవన్నీ మూడు గుణాల ప్రభావంతో (7.25), ఆసక్తి, విరక్తి వంటి పరస్పర భిన్న ధృవాలతో (7.27) ఏర్పడే భ్రాంతికి గురవుతాయి. ఇటుంటి
భ్రాంతులనుండి విముక్తి చెందాలంటే మనిషి పరమాత్మ వద్ద ఆశ్రయం పొందాలి.
సకల చరాచర విశ్వం
(వ్యక్తమైనది) ఓక బిందువు నుండి మొదలైందని విజ్ఞాన శాస్త్రం నిర్ధారించింది.
మనమంతా, మన చుట్టూ ఉన్న
విశ్వమంతా ఆ మూల బిందువుతో అనుసంధానించబడి ఉంటుంది. అలాగే అవ్యక్తరూపమైన భగవంతుని
విషయంలో కూడా మనమంతా ఆ పరమాత్మునితో ఒక అదృశ్యమైన వైర్/తీగతో అనుసంధానించబడి
ఉంటాము. కానీ పరమాత్మును మనం చేరకుండా అవరోధాలు కల్పించేవే భ్రాంతులు. ఆ అనంత
శక్తితో మనల్ని మనం అనుసంధానించి ఉంచుకునేందుకు శ్రద్ధ అనేది ఒక సాధనం (7.21).
7.16 శ్లోకంలో ఉల్లేఖించబడిన నాలుగు రకాలైన భక్తుల లాగా ఈ శ్రద్ధ ద్వారానే భక్తుల కోరికలు తీరుతూ ఉంటాయి (7.22). ఎవరికైతే
నూటికి నూరు శాతం శ్రద్ద ఉంటుందో అటువంటి వారు నాతో సమానమని పరమాత్ముడు స్పష్టం
చేస్తున్నారు (7.18).
భగవద్గీతను ఆచరణ
ద్వారానే అర్థం చేసుకోగలం. ఈ అధ్యాయములోని బోధనలు
మరింత స్పష్టంగా అర్థం
చేసుకోవాలంటే మన జీవితంలో భ్రాంతికి గురైన సందర్భాల్లో కలిగిన అనుభవాలను
విశ్లేషించుకోవాలి. ఈ భ్రాంతులను ఓక సారి మనం అర్థం చేసుకుంటే తదుపరి సందర్భాల్లో
మనం సాక్షిగానే మిగిలిపోతాము. భ్రాంతుల ప్రభావానికి లోనుకాకుండా ఉంటాము. ఇటువంటి
స్థితినే సర్వోన్నత విముక్తి దశ లేదా మోక్షం అంటారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి